LATEST UPDATES

Saturday, September 10, 2022

మిరపనారు పోద్దామా

            కాలానుగుణంగా పండించే పంటల్లో మిరప ప్రధానమైనది. ఈ నేపథ్యంలో  మిరప సాగు చేయాలనుకొంటున్న రైతులు సెప్టెంబర్ నెలలో మిరపనారు పోస్తేనే మనకు సరైన సమయంలో పంట చేతికి వస్తుంది. కాబట్టి మిరప నారుపోయటంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.


 



          ముందుగా మీకు ఒక ఎకరా పొలం ఉంది అనుకొంటే, ఈ ఎకరా చేనులో మిరప సాగుచేయాలనుకొంటే ముందుగా నారు మడులను ఏర్పాటుచేయాలి. వాటికి నీరు సులభంగా అందేలా కాలువలు చేసి మడులను చదును చేసుకోవాలి. ఆ తరువాత నారుపోయటానికి ముందే ఓసారి నీరు పెట్టి అందులో ఎకరా చేనుకు సరిపోయేలా 100 గ్రాముల విత్తనాలు వేసి వాటిపై పొడి మట్టి చల్లాలి. మనం వేసిన విత్తనాలు 9-10 రోజుల తరువాత మొలకెత్తుతాయి అంతవరకూ నీరు ఆరుతడిగా పెట్టాలి. ఎక్కువ నీరు పెడితే విత్తనాలు కుళ్లిపోతాయి కావున నీటి తడి విషయం లో  జాగ్రత్త వహించాలి. మడుల్లో విత్తనాలు మొలకెత్తిన తరువాత కూడా మొక్కలు కొంత పెద్ద అయ్యేవరకు నీరు ఆరుతడిగా పెట్టాలి. మొక్కలు త్వరగా పెరగటానికి తగిన మోతాదులో సేంద్రియ ఎరువులు అందించాలి.

          నారు ఎదిగి... చేలో నాటుకొనే సమయంలో మొక్క తలభాగం తుంచుకొంటే చేనులో మొక్క బలంగా నిల్చుంటుంది. విత్తనాలు విత్తిన 40-45 రోజులకు నాటు వేయాలి. ఒక ఎకరంలో 14-15 వేల మొక్కలు నాటవచ్చు. విత్తనాలు విత్తినప్పటినుంచి నాట్లు వేసుకునే వరకు దాదాపు ₹6 - ₹7 వేల వరకు ఖర్చు ఉంటుంది. నాట్లు వేసుకునే సమయంలో మొక్కల మధ్య దూరం 2X1 ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మొక్క మధ్య దూరంపాటిస్తే మొక్క ఎంత పెరిగినా కొమ్మలు అంటుకోకుండా ఉంటాయి. కలుపుతీసుకోవటం సులువుగా ఉంటుంది, మనం వేసే ఎరువు మొక్కలకు సంపూర్ణంగా అందుతుంది.



No comments:

Post a Comment