Sunday, April 20, 2025

LATEST UPDATES
>> కోళ్ళలో వైరస్ ల ప్రభావంతో వచ్చే వ్యాధులు! తీసుకోవాల్సిన జాగ్రత్తలు  >> కోళ్లలో వచ్చే పుల్లోరం వ్యాధి లక్షణాలు మరియు యాజమాన్యం  >> అల్లం సాగు విధానం, రకాలు, యాజమాన్య పద్ధతులు, ఎరువులు, మరియు సస్యరక్షణ  >> రబీలో 'కుసుమ' సాగు  >> రాగుల సాగులో మెళకువలు    

Monday, November 14, 2022

కోళ్ళలో వైరస్ ల ప్రభావంతో వచ్చే వ్యాధులు! తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 కోళ్ళలో వచ్చే వ్యాధులు ;


పుల్లోరం :

చిన్న పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధికి గురవుతాయి. ఈ వ్యాధి తల్లి నుండి పిల్లలకు గుడ్ల ద్వారా కూడా సంక్రమిస్తుంది. రోగం సోకిన పిల్లలు గుంపులుగా గుమికూడటం, భారంగా శ్వాసతీయడం, రెక్కలు వాల్చడం లక్షణాలు ఉంటాయి. తెల్లని రెట్ట మలద్వారం వద్ద అంటుకొని ఉంటుంది. గుండె, గిజర్డ్‌, కాలేయం మరియు పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు ఆంటీ బయాటిక్‌ మందులు వాడాలి.

వీటితో పాటు రానికెట్ రోగం,రక్త పారుడు రోగాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా కోడి మెత్తగా వుంటే వాటిని వెంటనే వైద్యులు చూపించి మందులను వాడటం మంచిది..లేదంటే మిగిలిన కోళ్లకు కూడా వ్యాధులు వ్యాపించి చనిపోయే ప్రమాదం వుంది


కోళ్ళ మశూచి :

కోళ్ళ అంటువ్యాధుల్లో ముఖ్యమైనది. ఈ వ్యాధి వలన గ్రుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవటం లేదా కోళ్ళు చనిపోవుటం జరుగుతుంది. మశూచి సోకిన కోళ్ళకు జుట్టు మీద, తుమ్మెలకు, కనురెప్పల చుట్టు పోక్కులు ఏర్పడతాయి. అప్పడుప్పడు కళ్ళల్లో కూడా ఈ పొక్కులు వచ్చి కళ్ళు కనబడవు. నివారణకు టీకాలు వేయించడం ఒక్కటే మార్గం. ఇవి 6 వారాల వయసులో మరలా 16వారాల వయసులో వేయాల్సి ఉంటుంది.


కొరైజ :

కోడి పిల్లలు సరిగా నీటిని, మేత తీసికొనక బరువును కోల్పోతాయి. ముక్కునుండి, కళ్ళనుండి నీరు కారుట రోగ లక్షణాలు. కళ్ళల్లో ఉబ్బి తెల్లని చీము గడ్డలుగా తయారవుతాయి. మరణసంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి ఈ వ్యాధి క్రిములు షెడ్డులోనికి ప్రవేశించిన, అన్ని బ్యాచ్లకు ఈ రోగం వస్తూనే ఉంటుంది.

ఒక బ్యాచ్లో ఈ వ్యాధి వచ్చినప్పడు కొద్ది రోజులు షెడ్డు ఖాళీగా పెట్టి, బ్లో లాంప్‌తో నేల, గోడలను కాల్చాలి. సున్నం, గమాక్సిన్‌, ఫినాయిల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపి జల్లివేయాలి. లిట్టరు ఎల్లప్పడు పొడిగా ఉండేలా చూడాలి. రోగం సోకిన పిల్లలకు యాంటిబయాటిక్‌ మందులు విటమిన్ల తో కలిపి వారం రోజుల పాటు వాడాలి.


ఎశ్చరీషియా కొలై :

బ్రాయిలర్‌ పిల్లల్లో ఈ వ్యాధి తీవ్రంగా వస్తుంది. బాక్టీరియా వల్ల కలిగే ఈ వ్యాధితో బ్రాయిలర్స్‌లో బరువు సరిగ్గా రాకపోవడం వల్ల నష్టం వాటిలుతుంది. ఈ వ్యాధి సోకిన కోడి పిల్లలు నీరసంగా ఉండి మేత సరిగా తినకపోవడం జరుగుతుంది. మరణించిన కోడి పిల్లల ప్రేగులు ఉబ్బి కనిపిస్తాయి. యాంటిబయోటిక్స్‌ మందులు మేతలో మరియు నీటిలో వాడితే ఈ వ్యాధి సోకిన పిల్లలను కాపాడవచ్చు. తాగు నీటితో పాటు సేనిటైజర్‌ మందును కోళ్ళకు ఇవ్వడం ద్వారా ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

కోళ్లలో వచ్చే పుల్లోరం వ్యాధి లక్షణాలు మరియు యాజమాన్యం

వాతావరణ పరిస్థితులలో మార్పుల కారణంగా పక్షులు, జంతువులలో వ్యాధులు వ్యాపిస్తుంటాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో పుల్లోరం వ్యాధి వ్యాపిస్తోంది.


ఈ వ్యాధి యొక్క చారిత్రక పేరు బాసిల్లరీ వైట్ డయేరియా. పుల్లోరం వ్యాధి సాల్మొనెల్లా ఎంటెరికా పుల్లోరమ్ వల్ల వస్తుంది.  ప్రభావిత పక్షులు ఉష్ణ మూలం దగ్గర గుమిగూడుతాయి, మరియు తెల్లని రెట్ట మలద్వారం వద్ద అంటుకొని ఉంటుంది. అదనంగా, పక్షులకు శ్వాసకోశ వ్యాధి, అంధత్వం లేదా కీళ్ల వాపు  ఉండవచ్చు. సెరాలజీని నిఘా సాధనంగా ఉపయోగిస్తారు. 


ఎక్కువగా కోళ్లు గుమికూడటం, పరిశుభ్రత లేని పాత్రలలో ఆహారం అందించడం ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి చిన్న పిల్లలకు ఎక్కువగా వ్యాపిస్తుంది. తల్లిపెట్టే గుడ్లద్వారా పిల్లలకు వ్యాపిస్తుంది. 

వ్యాధి నిర్ధారణ:

సంభావ్య సానుకూల పక్షులను గుర్తించడానికి సెరోలాజిక్ పరీక్ష, అయితే ఇన్ఫెక్షన్‌ని నిర్ధారించడానికి ఐసోలేషన్, ఐడెంటిఫికేషన్ మరియు సెరోటైపింగ్ అవసరం. ఈ రోగం సోకినా పిల్లల్లో శ్వాస తీయడం భారంగా ఉంటుంది. రెక్కలు వాల్చటం వంటి లక్షణాలు ఉంటాయి. గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. 

చికిత్స మరియు నియంత్రణ: 

సంక్రమణ నుండి విముక్తి మరియు సానుకూల పక్షులను మందలనుండి తొలగించడం నియంత్రణలో కీలకం. కోళ్ళ పెంపకం చేపడుతున్న వ్యాపారులు దీని నివారణకు యాంటీ బయాటిక్స్  వాడాలి లేదంటే నష్టపోతారు. పిచ్చుకలు, చిలుకలు, కౌజులు వంటి పక్షులకు కూడా ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది. 

అల్లం సాగు విధానం, రకాలు, యాజమాన్య పద్ధతులు, ఎరువులు, మరియు సస్యరక్షణ

అల్లం జింజిబరేసి (Zingiberaceae) కుటుంబానికి చెందిన దుంప జాతి ఔషధ మొక్క. అల్లం శాస్త్రీయ నామం జింజర్ అఫిసినెల్ దీన్ని ఆంగ్లంలో జింజర్ అంటారు. విస్తీర్ణం మరియు ఉత్పత్తి పరంగా, మన దేశం (23%), చైనా (24%) తర్వాత రెండవ స్థానంలో ఉంది. 

లాభాలు పొందే పంటల్లో అల్లం సాగు ప్రధానమైనది. అతితక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే పంట అల్లం. ఇది దుంప రకానికి చెందినది. దీనిని పచ్చి దశలో అల్లం గా ఎండిన తరువాత  శొంఠిగా వినియోగిస్తుండటంతో దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ పంటను శీతాకాలంలో సాగు చేసి మంచి దిగుబడులు పొందవచ్చు. తక్కువ స్థలంలో ఎక్కువ లాభాలు పొందాలనుకుంటే ఇది అనువైన పంట గా చెప్పవచ్చు. అల్లం విత్తుకోవాలంటే కిందట పంట నుంచి తీసిన దుంపలను కూడా విత్తనంగా వాడుకోవచ్చు. ఇందులో గామారన్, రియో-డి-జెనేరియో,బైరితుని, సుప్రభసురుచి, రకాలు ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. ముఖ్యంగా తెగుళ్లు సోకని రకాలు ఎంపికచేసుకోవాలి.


అల్లం సాగుకు నేల ఉదజని సూచిక (pH) 6.0-6.5 ఉన్న అధిక సేంద్రియ పదార్థం కలిగిన ఎర్ర, నల్ల నేలలు అనుకూలంగా ఉంటాయి.  విత్తనపు అల్లంను నెల రోజుల ముందే.. ఆరుబయట గోనెసంచుల కప్పి నీటి తడులు ఇస్తే పూర్తిగా పిలక సిద్ధమౌతుంది. అల్లం విత్తుకోవడానికి ముందే పొలాన్ని మూడుసార్లు దున్నుకోవాలి. ఆ తరువాత పశువుల ఎరువును చల్లుకోవాలి. కూలీల సహాయంతో చేనులో బెడ్లు ఏర్పాటు చేసుకోవాలి. మొక్కలకు నీరు సమృద్ధిగా అందాలంటే డ్రిప్ లేదా స్ప్రింకర్లను ఏర్పాటు చేయాలి. నీరు నిలిచే భూమిలో మాత్రం దీనిని సాగు చేయకూడదు. అలాంటి నేలలో అల్లం సాగు చేస్తే దుంప కుళ్లు వ్యాధి ఎక్కువగా ఉంటుంది. అల్లం నాణ్యత తక్కువగా ఉంది. సాధారణంగా ఎకరాకు 600 నుంచి 1000 కిలోల విత్తనం సరిపోతాయి. అయితే అల్లం రకం, విత్తే దూరం బట్టి కొంత మార్పు ఉండొచ్చు. విత్తే సమయంలో దుంపల మధ్య 9 ఇంచులు సాళ్ల మధ్య ఒక మీటరు దూరంలో నాటుకోవాలి. ఇది ఎనిమిది నుంచి తొమ్మిది నెలల పంట. 

అల్లం సాగులో  విత్తన శుద్ధి ప్రాముఖ్యత:

అల్లం దుంపలను విత్తడానికి ముందు విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కొన్ని రకాల వ్యాధులను సమర్థవంతంగా అరికట్టి కొంత ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు. విత్తన శుద్ధి లో ముందుగా లీటరు నీటికి 3గ్రా, మెటలాక్సిల్ లేదా 3 గ్రా. మ్యాంకోజెబ్ + 5 మి.లీ. క్లోరిపైరిఫాస్ కలిపిన ద్రావణంలో దుంపలను 30-40 నిమిషాలు నానబెట్టి తరువాత తీసి ఆరబెట్టాలి. లీటరు నీటికి 5 గ్రా. చొప్పున ట్రైకోడెర్మా విరిడె కలిపిన ద్రావణంలో ఆరబెట్టిన దుంపలను 30 నుండి40 నిమిషాలు నానబెట్టి విత్తుకోవాలి. దీంతో వేరు కుళ్ళు, దుంప కుళ్ళు మొదలైన వ్యాధులను సమర్ధవంతంగా నివారించవచ్చు.

అల్లం పంటను అంతర పంటగా సాగు చేసే విధానం:

అల్లం పంటను అంతర పంటగా కూడా సాగు చేసి సంవత్సరం పొడవునా అధిక ఆదాయాన్ని పొందవచ్చు. సాధారణంగా అల్లం పంట వెలుతురు పడే ప్రదేశంలో కంటే నీడపట్టున బాగా పెరిగి నాణ్యమైన దిగుబడిని ఇస్తుంది కావున కొబ్బరి తోటలు సాగుకు మంచి అనుకూలం. అలాగే కాఫీ, అరటి, ద్రాక్ష, నిమ్మ  జామ వంటి వివిధ రకాలైన పండ్ల తోటల్లో అల్లంను అంతర పంటగా సాగు చేసి రైతు సోదరులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.

అల్లం సాగులో సస్యరక్షణ చర్యలు:

దుంపకుళ్ళు తెగులు:  అల్లం సాగులో దుంప కుళ్లు తెగులు రైతులకు అధిక నష్టాన్ని కలగజేస్తుంది. ఈతెగులు ముఖ్యంగా అధికంగా నీరు నిల్వ ఉన్న భూముల్లోను,మురుగు నీటి వసతి లేని భూముల్లో ఎక్కువగా ఆశిస్తుంది. ఎక్కువ వర్షపాతం, నీరు నిలిచే పరిస్థితులు ఈ తెగులుకు అనుకూలం.ఈ తెగులు ఆశించిన దుంపలు మెత్తగా ఉండి కుళ్లిన వాసన వస్తుంది.

తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు మొక్కలు ఎండిపోయి చనిపోతాయి. దీని నివారణకు నాణ్యమైన దుంపలను ఎన్నుకోవాలి అలాగే విత్తన శుద్ధిని ఖచ్చితంగా పాటించాలి. పొలంలో మురుగు నీటి వసతిని కల్పించాలి. తెగులు సోకిన మొక్కలపై మెటలాక్సిల్ లేదా మాంకోజెబ్ 5గ్రా. లీటరు నీటిలో కలుపుకొని పోసుకోవాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా॥ లేదా ట్రైకోడెర్మా విరిడి 5 గ్రా॥ లీటరు నీటికి కలిపి తెగులు సోకిన మొక్కల చుట్టూ ఉన్న 4-5 మొక్కలకు మరియు వరుసల్లోని పాదులను ముంపుగా తడపడం వలన దుంపకుళ్ళు ఉధృతిని సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు.

ఆకుమచ్చ తెగులు: మొదట ఆకులు పెళుసుగా ఆకులపై అందాకారంలో అనేక నల్లటి మచ్చలు చుక్కలుగా ఆకుల సాయంపై ఏర్పడతాయి. దీని నివారణకు ఏదేని కాపర్ ఆక్సీక్లోరైడుగల శిలీంధ్రనాశిని (బైటాక్స్) ఔషధం 3గ్రా. లీటరు నీటికి ఎకరాకు 600 గ్రాములు, 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కంతా బాగా తడిచేలా పిచికారి చేయాలి.

ఆకుమాడు తెగులు: ఈ తెగులు లక్షణాలు మొదట భూమికి దగ్గరగా వున్న ఆకుల తొడిమలపై పొడవాటి మచ్చల రూపంలో కనిపిస్తాయి. ఈ మచ్చలు మొదట పేలవమైన ఆకుపచ్చ రంగు నీటి మచ్చలుగా ఏర్పడి తర్వాత గోధుమ రంగుకు మారుతాయి. ఇవి ఒకదానితో ఒకటి కలిసిపోయి పై ఆకులకు, ఆకు తొడిమెలకు వ్యాప్తి చెంది తొడిమెలు మాడిపోతాయి. దీని నివారణకు శుభ్రమైన పంటసాగు, పంట అవశేషాలను నాశనం చేయడం మరియు 1 గ్రా. కార్బండజిమ్ లేదా 1 మి.లీ. ప్రొపికొనజోల్ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. ఎకరాకు 200 గ్రాముల కార్బండైజిమ్ లేదా 200 మి.లీ. ప్రొఫికొనజాల్ మందును పిచికారీ చేయాలి.

వేరుపురుగు: మురుగు నీటి వసతి లేని పొలాల్లో వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వేరుపురుగు మొదట అల్లం దుంపల మొదళ్ళలో వేర్లను కత్తిరించి పంటకు నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు కార్బోఫ్యూరాన్ గుళికలు ఎకరాకు 7 కిలోలు,లేదా ఫోరేట్ గుళికలు ఎకరాకు 5 కిలోలు వేసి వేరు పురుగు ను నిర్మూలించవచ్చు.

దుంపకుళ్ళు ఈగ: దుంప కుళ్ళును తట్టుకొనే పీచు తక్కువగా వుండే అల్లం రకాలను సాగుచేయాలి. వేసవిలో పొలాన్ని లోతుగా దున్ని బాగా ఆరనివ్వాలి. దాంతో భూమిలో ఉన్న లార్వాలు ఎండవేడికి నశిస్తాయి. మురుగునీటి కాలవలు ఏర్పాటు చేసి నీరు నిలవకుండా చేయాలి. ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను తోటంతా సమంగా వేసుకోవాలి.

ఆకుముడత పురుగు: ఈ పురుగు లార్వాలు ఆకులను చుట్టి తినేస్తుంది. నివారణకు 0.3 శాతం కార్బరిల్ (లీటరు నీటికి 3గ్రా. మందు చొప్పున ఎకరాకు 600గ్రాముల మందు + లీటరు నీటికి 1. మి.లీ. చొప్పున శాండోవిట్ 200 మిల్లీ లీటర్లు ఎకరానికి మందు ద్రావణం ఆకులపై పిచికారి చేయాలి.

మొవ్వు తొలుచు పురుగు: ఈ పురుగు మొవ్వును తొలచటం వలన మధ్య కొమ్ము చనిపోతుంది.దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 2 మి.లీ. + సాండోవిట్ 1 మి.లీ. లేదా లీటరు నీటికి క్వినాల్ఫాస్ 2 మి.లీ. + సాండోవిట్ 1 మి.లీ. లేదా లీటరు నీటికి ఎండోసల్ఫాన్ 2 మి.లీ. + సాండోవిట్ 1 మి.లీ. కలిపిన ద్రావణాన్ని మొవ్వు ఆకులపై పిచికారి చేయాలి.



ఒక హెక్టారు(రెండున్నర ఎకరాలు) లో అల్లం సాగు చేస్తే దాదాపు 50 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. 


NOTE: అల్లం సాగు చేయాలనుకుని రైతులు ప్రభుత్వం ముద్ర పథకం లో రుణం తీసుకోవచ్చు.

@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates